హైదరాబాద్, అక్టోబరు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెలాఖరులోగా యానిమల్ కేర్ సెంటర్ (ఏసీసీ) నెలకొల్పేందుకు మున్సిపల్శాఖ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే 13 జిల్లాల్లో వీటిని ఏర్పాటుచేయగా, మరో 14 జిల్లాల్లో ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు వరంగల్, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లాల్లో వీటిని నెలకొల్పారు. మిగిలినచోట్ల అనువైన స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. జంతువులకు ప్రాథమిక అవసరాలైన తిండి, శుభ్రత, భద్రతను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటుచేస్తున్నారు. జంతు సంరక్షణ కేంద్రాల నిర్వహణకు అవసరమైన నిధులను మున్సిపాలిటీల ద్వారా కేటాయిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో కోతులు, కుక్కలు, ఇతర జంతువులను ఉంచడానికి విడివిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టెరిలైజేషన్ థియేటర్తోపాటు సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులు కేటాయిస్తున్నారు. జంతువులను వెటర్నరీ డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. కుక్కకాటు కారణంగా రేబిస్ వ్యాధి బారిన పడకుండా ప్రజలను కాపాడే లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 15,938 వీధికుక్కలకు స్టెరిలైజేషన్ చేశారు. జంతు సంరక్షణ కేంద్రాల్లో కోతులు, కుక్కలు, ఇతర జంతువుల కోసం చేస్తున్న ఏర్పాట్లను పలువురు జంతుప్రేమికులు ప్రశంసిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి, మేనకాగాంధీ కూడా ఇటీవల మంత్రి కేటీఆర్కు ఫోన్చేసి అభినందించడం విశేషం.