Deeksha Divas | ఒకనాడు సైన్యంలో దేశంకోసం పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటే దేశభక్తుడిగా భారత ప్రభుత్వం సేవామెడల్ ఇచ్చింది. కానీ, తెలంగాణ ప్రాంతం కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం చేస్తుంటే సమైక్య పాలకులుకర్కశంగా వ్యవహరించారు. యుద్ధ సమయంలో బంకర్లలో బతికినా దిగులు చెందలేదు. కానీ 2009, నవంబర్ 29 నాటి సందర్భం గుర్తుకువస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది అని మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతా రావు అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.., కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో అని కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు దిగిన ఆ చారిత్రక ఘట్టానికి కెప్టెన్ ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు ఏం జరిగింది? కరీంనగర్ నుంచి ఖమ్మం జైలు దాకా జరిగిన పరిణామాల గురించి ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా కెప్టెన్ లక్ష్మీకాంతా రావు కండ్లకు కట్టారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
నా పుట్టిన రోజును మరచిపోతనేమో కానీ దీక్షా దివస్ను మరచిపోను సిమెంట్ బస్తను ఇసిరేసినట్టు పోలీసులు కేసీఆర్ను ఇసిరేసిండ్లు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చేసిన త్యాగం మరువలేనిది, ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ర్టాన్ని సాధించిపెట్టింది. జీవితంలో తన పుట్టిన రోజును మరచిపోతానేమో కానీ, నవంబర్ 29 తారీఖు ఎన్నటికీ మరచిపోలేను.
మరచిపోలేని రోజు…
2009, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాంక జరిగిన సంగతులు జీవితంలో మరచిపోలేనివి. నా పుట్టిన రోజును మరచిపోతనేమో కానీ ఆ రోజును మరచిపోలేం. తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు తయారైపోతున్న రోజు (2009, నవంబర్ 29) పోలీసులు కరీంనగర్ నుంచి అల్గనూర్ దాంక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారు. కరీంనగర్ తెలంగాణ భవన్ నుంచి మేం దాదాపు వందకుపైగా వాహనాల కాన్వాయితో బయలుదేరినం. కేసీఆర్, జయశంకర్, నేనూ, నాయిని నర్సింహారెడ్డి, రాజయ్య యాదవ్, జీవీఆర్ ఇట్లా అందరం ఒకే వెహికిల్లో బయలుదేరాం. మా కాన్వాయిని అల్గనూర్ బ్రిడ్జి దగ్గర పోలీసులు తప్పించారు. ఒక్క మా వెహికలే.. మాకు ఇటుపక్క అటుపక్క మొత్తం పోలీసోల్ల వెహికిల్సే. మెల్లమెల్లగా కాన్వాయిని తప్పించిండ్లు.
అల్గనూర్ దగ్గరికి వచ్చేసరికి యుద్ధ వాతావరణం. అక్కడ నానా రకాల డ్రెస్సులతో, నానా రకాల తుపాకులతో, నానా రకాల లాఠీలతో మొత్తం అదొక యుద్ధక్షేత్రమనిపించింది.. మొత్తం పోలీసోల్లె. ఒక పెద్ద పోలీసాఫీసర్ కేసీఆర్ దగ్గరికి వచ్చి ‘సర్ మిమ్ములను అరెస్టు చేస్తున్నం’ అని అనంగనే కేసీఆర్ బాగా కోపం చేసిండు. ‘నన్ను అరెస్టు చేసేందుకు నీ దగ్గర ఏమన్నా కాయితం ఉందా.. నేను అరెస్టు కాను బండిదిగను’ అని చెప్పిండు. బలవంతంగా ఆయన్ను దించడంతోనే కేసీఆర్ నేలమీద కూసున్నడు. నిరసన తెలుపుతనే ఉన్నడు.
వస్తువును విసిరేసినట్టు…
‘అరే సార్ దిగిండు మనం కుడ దిగుతం’ అని దిగినం క్షణాల్లో పోలీసులు మమ్మలందరినీ పట్టుకున్నరు. పెద్ద బస్సు, పదుల సంఖ్యలో పోలీసుల వాహనాలు అక్కడి నుంచి స్టార్ట్ అయినయ్. అక్కడి నుంచి ఏం చెప్పకుంట, ఎక్కడా ఆపకుంట ఖమ్మం తీస్కపోయిండ్లు. ఖమ్మంలో ఒక ఎక్సైజ్ కేసులు చూసే ఒక రిటైర్డ్ జడ్జి ముందర పెట్టిండ్లు. అరే ఇదేంది అని ఆశ్చర్యపోయిండ్లు అందరూ. అప్పటికీ కేసు లేదు ఏం లేదు. అప్పటికప్పుడు మూడు గంటలు అక్కడ వెయిట్ చేయించి కేసు బుక్ చేసిండ్లు. కేసీఆర్ అన్నరు ‘మమ్ములను ఖమ్మం జైల్లో పెట్టొద్దు. అదొక చిన్న జైలు. మమ్మల్ని ఉంచాలంటే సెంట్రల్ జైలుకు తరలించాలే’ అన్నడు. అయితే అక్కడ పరిస్థితిని అనుమానంగా చూసిన జడ్జికి పోలీసులు రాసిచ్చిండ్లు ‘మేం రేప్పొద్దున హైదరబాద్కు షిప్ట్ చేస్తం’ అన్నరు. అంటే ఆయన రిమాండ్ రాసిండు. అప్పటికే కేసీఆర్ దీక్ష కొనసాగిస్తున్నడు. తెల్లారి ఓ పోలీసాఫీసర్ వచ్చిండు. ఎందుకచ్చిండ్లు? అని అడిగితే ‘ఊర్కనే చూసి పోతమని వచ్చినం’ అన్నడు. అంతా చూసుకొని పోయిండ్లు. తర్వాత చానా మంది పోలీసులతో వచ్చిండు. వస్తూ వస్తూ ఓ దిక్కుమాలిన, చిలుము పట్టిన స్టెచర్ తీస్కచ్చిండు. అప్పటికే డాక్టర్ సాబ్ (జీవీఆర్) కేసీఆర్కు పల్స్ చూస్తాండు. మేమంతా ఏంటీ పరిస్థితి అనుకుంటున్నం.. అప్పుడే పోలీసులు మా బ్యారక్లోకి వచ్చిండ్లు.. వాళ్ల రాకను గమనించి నాయిని నర్సింహారెడ్డి మిగతావాళ్లమంత గొడవజేసినం. ఒక సిమెంట్ బస్తను బండ్లెకు ఇద్దరు మనుషులు పట్టుకొని ఇసిరేసినట్టు, ఒక ప్రాణం లేని వస్తువును విసిరేసినట్టు కేసీఆర్ను ఇద్దరు పట్టుకొని ఆ స్టెచర్ మీద విసిరేసిండ్లు. మేం గొడవ పడుతున్నం. నాయినిని నెట్టేస్తే ఆయన కాలికి దెబ్బ తాకింది. డాక్టర్ సాబ్ను గోడకు నెట్టేస్తే ఆయనకూ దెబ్బ తాకింది. రాజయ్యయాదవ్ను ఓ దిక్కు నెట్టేసిండ్లు. నాక్కోపమచ్చింది. నేను బ్యారక్ గేట్ దగ్గర కొద్దిసేపు ప్రతిఘటించిన. అయినా అందరినీ నెట్టేసి దుర్మార్గంగా బ్యారక్కు తాళం వేసి కేసీఆర్ను తీస్కపోయిండ్లు.
కాల్రెక్కలు ఇరగ్గొట్టి..?
మాకు ఒకటే ఆందోళన.. ఉద్యమ నాయకుడినే ఇట్ల చేస్తే మనగతేంది? అని అనుకున్నం. అసలు కేసీఆర్ను వీళ్లేంజేస్తరు. కొంపదీసి ఎన్కౌంటర్ చేస్తరా.. ఏంది? జైలు బయట ఏం జరుగుతుందో మాకు అర్థం కావడంలేదు? కేసీఆర్ను ఏం చేస్తరు? పోలీసులు గింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నరు ఏందిది? అని మా మనసులు బాధించినయి. నిజానికి చెప్పడానికి నోరురావడం లేదు.. కానీ, అప్పుడు దుఃఖం తప్ప ఏం చేయలేకపోయినం.. అట్లాంటి పరిస్థితి అది. అక్కడి నుంచి కేసీఆర్ను హాస్పిటల్కు తీస్కపోయిండ్లని, అక్కడ ఆయన మమ్ములను కూడా పిలవాలని గట్టిగ చెప్పడంతో జైలర్ వచ్చి ‘కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నడు మిమ్ములను కూడా అక్కడికే రమ్మంటున్నరు’ అని చెప్పేసరికి భయం వేసింది. ఈ దుర్మార్గపు పోలీసులు ‘కాల్రెక్కలు ఇరగ్గొట్టి హాస్పిటల్లో వేశారా?’ పోలీసుల తీరు చూస్తే అదే అనుమానం. అయితే మేం జైలు నుంచి బయటకు రావడానికి అక్కడ దాదాపు అర్ధగంట తతంగం నడిచింది. కానీ, కేసీఆర్కు ఇవేమీ చేసినట్టు జైలు రికార్డుల్లో లేవు. మేం జైలర్ను అడిగాం. వాళ్లు నీళ్లు నమిలారు. జైలు వాళ్లు ఆగమాగం అయితాండ్లు. దాన్ని చూసి మా అనుమానానికి మరింత బలం వస్తాంది. మల్లా మేం జైలు నుంచి హాస్పిటల్కు పోయేసరికి అక్కడ బయటంతా యుద్ధ వాతావరణమే. పోలీసులు తెలంగాణవాదులు, హరీశ్రావు, కేటీఆర్.. వాళ్లతోపాటు జయశంకర్ సర్ అందరూ ఉన్నరు. ఎవ్వరి ముఖాలు చూసినా ఆందోళనే కన్పిస్తున్నది. మాకు మరింత భయం పెరిగింది. మమ్మల్ని అరెస్టు చేశామన్న విషయం తెలుసుకొని అల్గనూర్ నుంచి ఖమ్మందాకా ఊరూరా జనం క్షణాల్లో రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలను మేం కండ్లారా చూసినం. ఎక్కడికక్కడ పోలీసులు ప్రతీ గ్రామంల తెలంగాణవాదుల్ని అదుపులోకి తీసుకోవడం.. లాఠీచార్జీలు చేయడం లాంటివి చూస్తూ హాస్పిటల్కు చేరుకున్నం.
ఇక్కడేమో సీన్ అంతా ఇట్లా నిశబ్దంగా ఉంది. ‘జరగరానిది ఏదన్నా జరిగిందా’ అన్న అనుమానం వచ్చింది. అప్పటికే కేసీఆర్ దీక్ష విరమించిండని, ప్రచారం చేసిండ్లు. ఎట్టి పరిస్థితుల్లో దీక్ష విరమించే ఆలోచనే ఆయనకు లేదని మాకు తెలుసు. కానీ పోలీసులే ఏదో చేసి ఉంటరని అనుకున్నం. కేసీఆర్చేత బలవంతంగా దీక్ష విరమింపజేసినట్టు ఏవో తాగిచ్చిండ్లనీ, అదికూడా ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని అక్కడున్నోళ్లు చెప్పిండ్లు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో పిల్లలు కేసీఆర్ దీక్ష విరమించాలని, లేదంటే మేం పెట్రోల్ పోసుకొని చనిపోతామని నాలుగైదు వందల మంది ఆందోళన చేస్తున్నారని.. ఇలా నానా రకాల అబద్ధాలను కేసీఆర్కు ఒకవైపు చెప్తూనే మరోవైపు ఆయనకు ఏదో మత్తు ఇచ్చి ఆయన చేత గ్లాస్ పట్టిచ్చి పోలీసులే ఫొటో తీయించి ప్రెస్కిచ్చి నానా రకాలుగా ఉద్యమాన్ని మలినం చేసిండ్లు. ఆయనకు అసలు విషయం తెలిసి చాలా సీరియస్ అయ్యారు. అప్పటికే ఆయన దీక్ష కొనసాగిస్తున్నరని, పోలీసులు దుర్మార్గంగా దీక్ష విరమింపజేసినట్టు జయశంకర్ సార్ చెప్పిండు.
‘లేదు.. లేదు నేనే అసలు విషయం చెప్తా’.. అని కేసీఆర్ అల్లకల్లోలం చేశారు. అంతకుముందే స్టేట్ హ్యూమన్ రైట్స్ను ఆశ్రయిస్తే కలెక్టరే స్వయంగా హాస్పిటల్కు రావడంతో పరిస్థితి మారింది. ఒకనాడు సైన్యంలో దేశం కోసం పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటే దేశభక్తుడిగా భారత ప్రభుత్వం సేవామెడల్ ఇచ్చింది. కానీ, మేం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తుంటే జైల్లో వేసింది ప్రభుత్వం. కేసీఆర్ అకుంఠిత పట్టుదల సామాన్యమైందిగాదు. ఆఖరికి తెలంగాణ ప్రజల పోరాట పటిమ చూసి కేంద్రం దిగివచ్చింది. తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడిగా కేసీఆర్ పోరాటం చరితార్థమైంది. సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన దార్శనిక పాలనతో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు. జీవితానికి మరచిపోలేని అనుభవాన్ని, తృప్తిని ఇచ్చింది.
– ప్రజ్ఞా వర్షిత్