హైదరాబాద్, మార్చి 14 : హైదరాబాద్ అభివృద్ధికి కంటోన్మెంట్ అడ్డుగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ పరిధిలో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన వ్యాఖ్యలు వందశాతం నిజం అని.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఈ విషయంలో బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త, జర్నలిస్టు, సెంటర్ ఫర్ పాలసీ ఆల్టర్నేటివ్స్ వ్యవస్థాపకుడు మోహన్ గురుస్వామి మంత్రి కేటీఆర్ మాటలు అక్షర సత్యాలని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మండిపడ్డారు. ‘కేటీఆర్ ఈజ్ రైట్.. కిషన్రెడ్డి అజ్ఞానంతో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. జంటనగరాల అభివృద్ధికి కంటోన్మెంట్ తీవ్ర అవరోధంగా మారింది. కంటోన్మెంట్ భూములపై చట్టబద్ధమైన అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నాయి. దేశంలోని ఇతర కంటోన్మెంట్ల కంటే సికిందరాబాద్ కంటోన్మెంట్ పూర్తి భిన్నమైంది. ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న ఒక ఒప్పందం. నాటి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కూడా దీన్ని అంగీకరించి.. ఎప్పుడు అడిగితే అప్పుడు వెనక్కు తగ్గింది. సికిందరాబాద్ కంటోన్మెంట్లో రోడ్లు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. మిలిటరీ వాళ్ల గోల్ఫ్ కోర్సులు, మిలిటరీ లైన్ల దగ్గర మాత్రమే అన్నీ బాగుంటాయి. కంటోన్మెంట్ లైన్ల నిర్వహణకు యథేచ్ఛగా పన్నులు వేస్తుంది. ఎన్నో ఏండ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి కంటోన్మెంట్బోర్డు పన్నులు కూడా చెల్లించడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ తెలిసే మాట్లాడుతున్నది. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కంటోన్మెంట్లో నివాసమున్న తమిళులలో ఎల్టీటీఈ సానుభూతి పరులున్నారంటూ వారివల్ల ఇక్కడి 54వ ఇన్ఫెంట్రీ డివిజన్కు ప్రమాదం పొంచి ఉన్నదంటూ హైకోర్టు జడ్జికి సీల్డ్ కవర్ ద్వారా తప్పుడు సమాచారం అందించి తప్పుడు మార్గంలో ఆర్డర్ తెచ్చుకొన్నది.’ అని మోహన్ గురుస్వామి తీవ్రంగా స్పందించారు. ఆర్మీ విజయోత్సవాలు చేసుకొనేందుకు బట్టికలోవా మెస్ (శ్రీలంక తమిళ పట్టణం) కూడా ఉన్నదని ఎద్దేవాచేశారు.
కిషన్రెడ్డిపై నెటిజన్ల మండిపాటు
మంత్రి కేటీఆర్ 100% కరెక్ట్. హైదరాబాద్ ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చెందుతుంటే.. కంటోన్మెంట్ ఇప్పటికీ 90వ దశకంలో ఉండిపోయింది.. ఇరుకైన రోడ్లు.. మౌలిక సదుపాయాలు.. ఇతర సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతుంది. – సింహారామ్
మంత్రి కేటీఆర్ ఎన్నో రకాలుగా కంటోన్మెంట్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషిచేస్తున్నారు. బీజేపీ లీడర్ కిషన్రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం – దుర్గా ప్రసాద్రెడ్డి
నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ రహదారుల మూసివేతలతో ఇబ్బంది పడ్డ 80 ఏండ్ల వృద్ధుడిని. కేంద్రం ఎవరి భద్రత గురించి ఆందోళన చెందుతున్నది. మరి అదే అధికారులు వచ్చి ప్రజల్లో కలిసి ఎలా తిరుగుతున్నారు? – రంగాచార్యులు అమరవాది