హైదరాబాద్/కవాడిగూడ, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, ఏఈఈ పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం తక్షణం చొరవ తీసుకుని ఫలితాలను ప్రకటించడంతోపాటు ఉద్యోగ భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి అనంతరం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గురువేశ్, అఖిల్, సాయితేజ, శ్వేత, సాహితి, నర్మద, రాజు, కిశోర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో గ్రూప్-4 క్యాటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 1న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 9,51,205 మంది దరఖాస్తు చేశారు. జూలై 1వ తేదీన పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 7,63,835 మంది, పేపర్-2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 28న ప్రిలిమినరీ కీని కమిషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ చివరివారంలో లేదంటే అక్టోబర్లో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నదని టీఎస్పీఎస్సీ వర్గాలు అప్పట్లో అంచనా వేశాయి. ఈలోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఫలితాల వెల్లడి వాయిదా పడింది.
అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి, మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం, గవర్నర్ తమిళిసై దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వంటి కారణాలతో ఫలితాలు ఇప్పట్లో కష్టమనే ప్రచారం జరుగుతున్నది. టీఎస్పీఎస్సీలో ప్రస్తుతం సుమిత్ర ఆనంద్తానోబా, అరుణకుమారి మాత్రమే సభ్యులుగా ఉన్నారు. పరీక్ష ఫలితాలు వెల్లడించాలంటే వీరిలో ఒకరిని సీనియార్టీని బట్టి తాత్కాలిక చైర్మన్గా నియమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఫలితాలపై సందిగ్ధత కొనసాగుతున్నది.