కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇతర దీర్ఘకాలిక రోగులకు చికిత్స అందించటం వైద్యులకు కత్తిమీద సాములా మారింది. క్యాన్సర్ వంటి వ్యాధులున్నవారికి కరోనా సోకితే వైద్యం మరింత క్లిష్టంగా మారుతున్నది. దాంతో క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడంలో ప్రత్యేక దృష్టి నిలిపామని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలలిత తెలిపారు. కీమోథెరపీ అవసరమైన రోగులకు ఇంజెక్షన్లకు బదులు ట్యాబ్లెట్లు అందిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ రోగులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాంతో వారికి కరోనా వేగంగా సోకుతుంది. క్యాన్సర్ రోగులకు చికిత్స తప్పనిసరి కాబట్టి వారికి వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది మనో ధైర్యంతో పనిచేస్తున్నారని జయలలిత తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ రోగులకు ఫోన్ ద్వారా తగిన సూచనలు అందిస్తూ వైద్యులు అండగా ఉంటున్నారన్న జయలలిత ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
క్యాన్సర్ రోగులకు కరోనా సోకితే ఎలా వైద్యం చేస్తున్నారు?
క్యాన్సర్ బారిన పడి కీమో థెరపీ అవసరమైన రోగులు వీలైనంతవరకు ఇంటివద్దనే చికిత్స పొందేలా ఏర్పాట్లుచేస్తున్నాం. ఇంజెక్షన్లకు బదులు ట్యాబ్లెట్లు ఇస్తున్నాం. క్యాన్సర్ రోగులకు గతంలో నెలకు సరిపడా మందులను అందించే వాళ్లం. ఇప్పుడు మూడు నెలలకు సరిపడా ఒకేసారి ఇస్తున్నాం. కరోనా బారినపడ్డ క్యాన్సర్ రోగులకు లక్షణాలు మైల్డ్గా ఉంటే మేమే వైద్యంచేస్తున్నాం. తీవ్ర లక్షణాలున్నవారిని గాంధీ దవాఖానకు తరలించి వైద్యసేవలు అందేలా ప్రత్యేక దృష్టి నిలిపాం. క్యాన్సర్ రోగులకు సర్జరీలు చేయాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యస్థితిని అంచనావేసి ఒక నెలవరకు మాత్రమే ఆపగలుగుతాం. వైద్యుల సూచన మేరకు అవసరమైన వారికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్జరీలు నిర్వహిస్తున్నాం.
కరోనా వచ్చి పరిస్థితి సీరియస్గా ఉంటే?
క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు కరోనా చాలా తొందరగా సోకుతుంది. వ్యాధితోపాటు అందుకు సంబంధించిన మందుల వాడకం వల్ల ఇమ్యూనిటీ లోపంతో ఉంటారు. సాధారణ వ్యక్తులకన్నా తొందరగా వైరస్ బారినపడే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి కరోనారోగి జాగ్రత్తగా ఉండాలి. చాలావరకు బయట మనుషులతో కలవకుండా ఉంటే మంచిది. వారి వైద్య చికిత్స యథావిధిగా కొనసాగించాలి. కరోనా సోకిన క్యాన్సర్ రోగులను ముందు జాగ్రత్తగా గాంధీ, టిమ్స్ దవాఖానలకు పంపిస్తున్నాం. ఇప్పటివరకు కరోనా బారినపడిన క్యాన్సర్ రోగుల్లో 25 నుంచి 30 శాతం మందిలో తీవ్ర ప్రభావం చూపినట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. వారిలో కొంతమందికి వెంటిలేటర్ అవసరం ఏర్పడింది.
కరోనా సోకకుండా క్యాన్సర్ రోగులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
కరోనా వ్యాప్తి వల్ల క్యాన్సర్ రోగులు చాలా అవస్థ పడుతున్నారు. మా దవాఖానకు చాలామంది కరోనా లక్షణాలతోనూ వస్తున్నారు. వారిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చిన లక్షణాలా? కరోనా వల్లనా అనే అనుమానంతో టెస్టులు చేయిస్తున్నాం. కరోనా లక్షణాలు అని తెలిసిన వెంటనే చికిత్స చేసి, ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండమని సలహా ఇస్తున్నాం. క్రిటికల్ పరిస్థితుల్లో వైద్యచికిత్సకు కొంత ఆలస్యం అయినా ఎక్కువ రోజులు గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. చాలావరకు టాబ్లెట్ల రూపంలో మందులను ఇచ్చేందుకు డాక్టర్లు దృష్టి పెట్టారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత శుభ్రత పాటించాలి. శానిటైజర్, భౌతికదూరం పాటించినా కొన్నిసార్లు కరోనా బారిన పడుతున్నారు. కరోనా పట్ల ఆందోళన చెందకుండా ధైర్యంతో వ్యాధిని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.