హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీలు, ఎన్జీవోలతో విద్యాశాఖ కుదుర్చుకున్న ఎంవోయూలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఒప్పందాలు, అధికారుల పాత్రపై లోతైన విచారణ జరపాలని పట్టుబడుతున్నాయి. బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తేల్చిచెబుతున్నాయి. ఒక ప్రైవేట్ సంస్థ ఎలా లబ్ధ్దిపొందిందన్న విషయం శుక్రవారం ‘ఎడ్యుటెక్ గాలం.. సర్కార్ సాయం’ కథనం ద్వారా ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల ద్వారా ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు తీవ్రంగా చర్చించుకోవడం కనిపించింది. ప్రైవేట్ సంస్థల మనుగడకు సర్కార్ సహకరించడం గర్హనీయమని టీచర్లు మండిపడుతున్నారు.
ఎస్సీఈఆర్టీ ఉండగా.. రెడ్కార్పెటా..
రాష్ట్రంలో ఎస్సీఈఆర్టీ, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ/సైట్ వంటి సంస్థలున్నాయి. ఇవి ఉండగా ప్రైవేట్ ఎన్జీవోలను విద్యాశాఖ ప్రోత్సహించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఈ సంస్థల సేవలను వినియోగించుకోకుండా, ప్రైవేట్కు దాసోహం కావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు సర్వేలను సాకుగా చూపి ప్రైవేట్ సంస్థలకు రెడ్కార్పెట్ పరుస్తున్నాయని.. ఇది పూర్తిగా విద్యా ప్రైవేటీకరణే అవుతుందని అంటున్నాయి. అధికారుల తీరును ఖండించడంతో పాటు సంస్థల పెత్తనమేంటని నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం, టీచర్ల పనితీరును తక్కువ చేసే ఆలోచనకు విద్యాశాఖ ఇకనైనా ముగింపు పలుకాలని టీచర్ సంఘాలు కోరుతున్నాయి. ఆన్లైన్ పాఠాల పేరిట విద్యార్థులను డిజిటల్ బానిసలను తయారుచేస్తున్నారని, విద్యార్థులపై బలవంతంగా ప్రైవేట్ ఆన్లైన్ పాఠాలను రుద్దుతున్నారని టీచర్లు మండిపడుతున్నారు. ఇది విద్యార్థులపై మానసిక ఒత్తిడికి దారి తీస్తుందంటున్నాయి.
ప్రైవేట్ను ప్రోత్సహించడం తగదు : తపస్
ప్రైవేట్ ఎడ్యుటెక్ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించడం దారుణం. ఆన్లైన్ పాఠాల పేరిట ఎన్జీవోలను విద్యార్థులు, టీచర్ల మీద రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి. రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యాలున్న టీచర్లు చాలామంది ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై కోర్సులను అమలుచేస్తే బాగుండేది. ఇకనైనా ప్రైవేట్ ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థల మాయలో సర్కార్ పడొద్దని, విద్యారంగంపై రుద్ద వద్దని కోరుతున్నాం.
ఆ అధికారులను బదిలీ చేయాలి : ఎస్టీయూ టీఎస్
బడుల్లో సర్కార్ నియమించిన టీచర్లే పాఠాలు చెప్పాలి. ఎన్జీవోలు, ప్రైవేట్శక్తులు కాదని సర్కార్ గుర్తుంచుకోవాలి. వారేమీ సర్కార్ టీచర్లకంటే గొప్పవారేం కాదు. సీఎం జోక్యం చేసుకుని తక్షణమే విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి. ఎన్జీవో సంస్థలను నియంత్రించాలి. ప్రైవేటీకరణకు ఆస్కారం కల్పిస్తున్న అధికారులు బదిలీచేయాలి. లేదంటే టీచర్లంతా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి ఉంటుంది.
స్వేచ్ఛగా పాఠాలు చెప్పే పరిస్థితి కల్పించండి : టీఎస్ యూటీఎఫ్
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించి, తరగతికొక టీచర్ను నియమించి నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషిచేయాలి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీల వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని రుద్దడం దారుణం. ఈ ఆన్లైన్ క్లాసులు నిరూపయోగంగా ఉన్నాయి. ఇకనైనా ఈ భారం నుంచి విముక్తి కల్పించి, టీచర్లు స్వేచ్ఛగా పాఠాలు చెప్పే పరిస్థితులు కల్పించండి.
‘ఎడ్యుటెక్ గాలం’పై సర్కార్ ఆరా
‘ఎడ్యుటెక్ గాలం.. సర్కార్ సాయం’ కథనంపై ప్రభుత్వం ఆరా తీసింది. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కాగా, పూర్వాపరాలపై సీఎంవో వర్గాలు విద్యాశాఖ అధికారులను ఆరా తీశాయి. ఎడ్యుటెక్ సంస్థలు, ఎన్జీవోలతో ఒప్పందాలు- వాటి పర్యవసనాలపై సమాచారం కోరారు. దీనిపై విద్యాశాఖ అధికారులు సీఎంవోకు నివేదిక సమర్పించారు.