Gangula Kamalakar | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): బీసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష సాయం అందించే పథకానికి సంబంధించిన విధి విధానాలను సోమవారం ఖరారు చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపుతామని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని వెల్లడించారు. ఈ పథకం అమలుకు సంపూర్ణ విధి విధానాలను రూపొందించేందుకు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ కుల వృత్తులకు చేయూతనందించే దిశగా సుదీర్ఘంగా చర్చించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన మంత్రుల బృందం సోమవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల్లోని కుల వృత్తుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చితికిపోయిన కుల వృత్తులకు అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటున్నదని చెప్పారు. సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రాణికుముదిని, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.