హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ధరణిలో తలెత్తిన సమస్యలకు త్వరలో పరిష్కారం లభించనున్నది. సమస్యల పరిష్కారం దిశగా క్యాబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేస్తున్నది. ధరణిలో తలెత్తిన భూ సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం మాడ్యూల్స్ను పరిశీలించింది. ఇందులో భాగంగా ధరణిలో దరఖాస్తును తిరస్కరిస్తే.. తగిన కారణాన్ని వివరిస్తూ అర్జీదారుకు రాతపూర్వకంగా తెలియజేయాలని అధికారులకు సూచించింది. రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్ ద్వారా కానీ, మీసేవ ద్వారా కానీ అర్జీ పెట్టుకొంటున్నారని, అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తే రాతపూర్వక వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో సదరు రైతు అందుకు కారణాన్ని తెలుసుకొని, ఏ డాక్యుమెంట్లు కావాలో చూసుకొని మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి, ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారులకు మంత్రులు తెలిపినట్టు సమాచారం.
నవంబర్ 12న జరిగిన సమావేశంలో గుర్తించిన పలు సమస్యల పరిష్కారానికి మాడ్యూల్స్ను సబ్కమిటీ గురువారం పరిశీలించినట్టు తెలిసింది. 1) పేరులో మార్పులు, చేర్పులు, విస్తీర్ణంలో మార్పులు, సర్వే నంబర్ల తొలగింపు, ఎన్వోసీ/ ఓఆర్సీ/ 38-ఈ/13-బీ, సర్వే నంబర్ను భిన్నమైన ఖాతాలకు మళ్లించటం, అసైన్డ్ భూములు పట్టా భూములుగా మార్పు, ల్యాండ్ నేచర్/ల్యాండ్ టైప్ను మార్చటం, మిస్సింగ్ సర్వేనంబర్లు / కొత్త ఖాతా సృష్టించటం, ఖాతాల విలీనం / ఖాతాను విభజించటం, లావాదేవీని నిలిపివేయటం/ ఉపసంహరించటం, జాయింట్ పట్టా, జీపీఏ విత్ పీపీపీబీ, పట్టాదార్ పాస్పుస్తకం లేని జీపీఏ, పీటీ సర్టిఫికెట్లు తదితర సమస్యలపై అధికారులు రూపొందించిన మాడ్యూల్స్ను పరిశీలించి, చర్చించినట్టు సమాచారం. సమావేశంలో పలు సందేహాలు వ్యక్తంచేసిన సబ్ కమిటీ.. వాటి నివృత్తికి కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మరోసారి సబ్ కమిటీ సమావేశమై పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనకు పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.