BV Raghavulu | మిర్యాలగూడ : 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం కనుమరుగవుతుందని, వాటిని రక్షించేవాళ్లు ఏకతాటిపైకి రావాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయని, అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయని రాఘవులు తెలిపారు. 2024లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మరణ శాసనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, అందులో భాగంగానే ఈ నెల 23న బీహార్లో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి సీపీఎం పార్టీ హాజరవుతుందని, తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ కూడా రావాలని ఆయన కోరారు.
తమకు కూడా కేరళలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉందని, అయినప్పటికీ బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ముందుకెళ్తున్నామని చెప్పారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశంలో మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన చట్టాలను తీసుకురాబోతుందన్నారు. ఢిల్లీలో తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్ను అన్ని పార్టీలు ఖండించాయని, ఫెడరల్ వ్యవస్థను బలపరచాలనే లక్ష్యం ఉన్న వారందరూ ఆ ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని కోరారు. యూనిఫాం సివిల్ కోడ్ను బలవంతంగా దేశంపై రుద్దేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దీనివల్ల ప్రజల మధ్య విభజన సృష్టించి మత విధ్వేషాలతో రాజకీయాలు చేయాలని చూస్తున్నదని పేర్కొన్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తీగల సాగర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.