హైదరాబాద్ : నగరంలోని హెచ్ఐసీసీలో నిర్వహించిన నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) బిజినెస్ సమ్మిట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ డిమాండ్లపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు నిరంజన్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ప్రతిష్టాత్మక ఆయిల్ పామ్ బిజినెస్ సమ్మిట్ను హైదరాబాద్లో జరిపినందుకు కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సాగు నీటి వసతిని పెంచడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున .. ఏడాదికి రెండు సార్లు ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు ఎనిమిది విడతలలో రైతుల ఖాతాలలో జమచేయడం జరుగుతుందని తెలిపారు.
కేంద్రం వంటనూనెల దిగుమతి కోసం ఏటా రూ.లక్ష కోట్లు వెచ్చిస్తున్న పరిస్థితిని అంచనా వేసి తెలంగాణ ఆయిల్ పామ్ వైపు దృష్టి సారించింది. పామాయిల్ దేశీయ డిమాండ్కు తగినట్లుగా ఉత్పత్తి సాధించాలంటే దేశంలో ఇంకా 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలి. తెలంగాణలో ఆయిల్ పామ్ గెలలు అత్యధిక నూనె ఉత్పత్తి శాతం కలిగి ఉన్నవి.. దేశంలో అత్యధికంగా 19.22 శాతం నూనె ఉత్పత్తి అవుతుంది అని తెలిపారు. ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో కేంద్రం 1.12 లక్షల ఎకరాలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి.
తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO – OP) కింద ఆమోదించి నిధులు కేటాయించాలి. ఆయిల్ ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (FFB) ధర టన్నుకు రూ.15000 కనీస ఖచ్చితమైన ధర నిర్ణయించి రైతులను ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సహించాలి. ఆయిల్ పామ్ సాగుకు అవసరమయ్యే బిందు సేద్యం యూనిట్ ధరను పెంచి విస్తీర్ణ పరిమితిని ఎత్తేయాలి అని నిరంజన్ రెడ్డి కోరారు.