Telangana | నల్లగొండ ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ) / సూర్యాపేట / జనగామ : పదేండ్ల తరువాత మళ్లీ కరువు తరుముకొస్తున్నది. బోర్లు వేస్తే 80 ఫీట్ల లోతులో ఉబికి వచ్చే గంగమ్మ ఇప్పుడు 1.98 మీటర్ల లోతుకు పడిపోయింది. జనగామ జిల్లాలో గత ఏడాది 5.39 మీటర్లపైన ఉన్న భూగర్భ నీటి మట్టాలు..ఈ ఏడాది మార్చి వరకు 7.37 మీటర్ల లోతుకు పడిపోయాయి. కేవలం నెలరోజుల వ్యవధిలోనే 1.98 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో కరువుఛాయలను సూచిస్తున్నాయి.
జిల్లాలో యాసంగిలో 1.76 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. జిల్లాలోని ఏడు రిజర్వాయర్లు, 797 చెరువులు ఉండగా, అన్నింట్లోనూ నీటి మట్టాలు గణనీయంగా తగ్గి పోయాయి. ఫలితంగా జిల్లాలో కేవలం 3నెలల వ్యవధిలోనే 50వేలకు పైగా బోర్లు ఒట్టిపోయాయి. దీంతో చివరి దశలో ఉన్న వరికి పూర్తిస్థాయిలో సరిపడా నీరందక పంటలు ఎండిపోతున్నాయి.
జిల్లాలో చెరువుల ఆయకట్టు కింద 1.50లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యాన్ని నీటి పారుదలశాఖ అధికారులు లక్ష ఎకరాలకు కుదించామని చెబుతున్నా..వాస్తవానికి జిల్లాలో 50వేల ఎకరాల లోపు పంటలకే నీరు అందడంలేదు. దేవరుప్పుల, జనగామ, బచ్చన్నపేట, రఘునాథపల్లి, లింగాలఘనపురం, నర్మెట, చిల్పూరు, స్టేషన్ఘన్పూర్, జఫర్గడ్ మండలాల్లో ఇప్పటికే వరి ఎండిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
ఇద్దరు మంత్రులు ఉన్నా…
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్లో డెడ్స్టోరేజీ ఉన్నా కేసీఆర్ సర్కారు నీళ్లిచ్చి రైతాంగాన్ని ఆదుకున్నది. నేడు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు సాగర్, కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయించుకుండా చేతులెత్తేశారు. ఫలితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3లక్షల ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోయింది. పండ్ల తోటలు కూడా తూడ్చుకుపెట్టుకుపోయాయి. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 40 వేలకు పైనే ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.
2015లో సాగర్లో 508 అడుగుల మేర నీరు ఉన్నా కేసీఆర్ సర్కారు పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేసింది. ఈసారి 515 అడుగులు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లివ్వడం లేదు. కనీసం ఎండిన పంటల వైపు చూసి, రైతాంగానికి భరోసా ఇచ్చిన ప్రజాప్రతినిధి లేరు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలో తీవ్రంగా కుంగిపోతున్న రైతాంగాన్ని చూసి చలించి భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జనగామ, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటనకు వస్తున్నారు.
సర్కారు నిర్లక్ష్యంతో ఎండిన పంటలు
కేసీఆర్ సర్కారులో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కుంటలు, చెరువులు నింపేవారు. దాంతో బోర్లలో, బావుల్లో నీళ్లు ఉండేవి. కాల్వల ద్వారా నీళ్లు వచ్చేవి. పంటలు బాగా పండాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటిని వదలడంతో పది రోజులకు పైగా అధికారులు నిర్లక్ష్యం చేశారు. నేడు 11 ఎకరాల్లో వరి పెట్టిన. పంట పూర్తిగా ఎండిపోయింది. నాలుగు లక్షలకు పైగా పెట్టుబడి నష్టపోయా.
– దయ్యల లింగయ్య, రైతు, వెలుగుపల్లి, తుంగతుర్తి మండలం