హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాలు మానుకుని జాతకాలు చెబుతున్నారు. అలా చేసి సమాజంలో నవ్వుల పాలు కావొద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హితవు పలికారు. బుధవారం మంత్రుల నివాసంలో ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులు వినోద్ కుమార్తో భేటీ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులు సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యజ్ఞంలా చేపట్టిన మన ఊరు – మన బడి, స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధన కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై స్పందించారు.
బండి సంజయ్.. సీఎం కేసీఆర్ జాతకం బాగా లేదంటారు. సీఎం కేసీఆర్ జాతకం చాలా బాగుంది. బండి సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారు.. అని ఆయన ప్రశ్నించారు.
మన ఊరు – మన బడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన రాష్ట్ర ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలు. ప్రైవేటు స్కూల్స్ నుంచి డబ్బులు వసూలు కోసం ఇంగ్లీష్ మీడియం బోధన అంటూ బండి సంజయ్ విమర్శలు చేశారు.
తలా తోక లేకుండా బండి సంజయ్ ఇలా అనాలోచిత వ్యాఖ్యలు చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
మన ఊరు – మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల దశ మారనుంది అని ఆయన తెలిపారు.
విపక్ష నాయకులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని విమర్ధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. విపక్ష నాయకులుగా నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, తెలంగాణ ట్రైబల్ మేధావుల ఫోరం అధ్యక్షులు డా. ఎం. ధనాంజయ్ నాయక్, ప్రధాన కార్యదర్శి డా. జీ. హరిచరన్, వైస్ ప్రెసిడెంట్ డా బీ. రమణ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ డా. రవితేజ, ఎస్సీ మేధావుల ఫోరం ప్రెసిడెంట్ ఆరేపల్లి రాజేందర్, ప్రసాద్, తదితరులు ఉన్నారు.