హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ అప్పుల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హితవు పలికారు. పార్లమెంటు సభ్యుడిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు. ఏదైనా మాట్లాడే ముందు దాని గురించి పకా సమాచారం తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్ర అప్పులపై బండి సంజయ్ వ్యాఖ్యలను వినోద్కుమార్ గురువారం ఖండించారు.
నాలుగు రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్బీఐ తాజా గణాంకాలను చదువుకోవాలని సూచించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఎకువ అప్పులున్న టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ లేనే లేదని స్పష్టంచేశారు. ఎంపీగా ఉండి పార్లమెంటులో పెట్టిన నివేదిక చదువుకోకుండా బండి సంజయ్ బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో ప్రాజెక్టులు కట్టి ప్రజల భవిష్యత్తును నిలబెడుతున్నదని, నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడుతున్నదని గుర్తుచేశారు.
అప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ కోసం వాడటం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సగటు మనిషికి తరతరాలుగా ఉపయోగపడే విధంగా విలువైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. అప్పులపై ప్రతి నెలా బకాయిలు (ఈఎంఐ) చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ఎకువ అప్పులున్న టాప్ 10 రాష్ట్రాల్లో ఐదు బీజేపీ పాలిత రాష్ట్రాలేనన్న విషయం బండి తెలుసుకోవాలని సూచించారు.