కోస్గి, ఏప్రిల్ 18 : సీఎం ఇలాకాలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ వర్గానికి సంబంధించిన సమాధులపైకి బుల్డోజర్లను పంపడంపై నిరసన వ్యక్తమైంది. శుక్రవారం ప్రభుత్వ ఆస్తులపైకి బుల్డోజర్లతో విరుచుకుపడిన అధికారులు శనివారం ఒక వర్గం సమాధులపైకి జేసీబీలను పంపడం ఉద్రిక్తతకు దారితీసింది.
ముందస్తు సమాచారం లేకుండా శ్మశానవాటిక ప్రహరీ కూల్చడంతో మున్సిపల్ కమిషనర్, చైర్మన్పై ఆ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ఇలాకాలో ఇలాంటి చర్యలు సరికావని మండిపడ్డారు. సమాధులు ఉన్నాయని తెలిసి.. ఎవరూలేని సమయంలో తమ పెద్దల గుర్తులను చెరిపేయడం సరికాదంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.
బీఆర్ఎస్ నాయకులు వెంకట నర్సింహులు, నరేందర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, బెజ్జు నీలప్ప, కోనేరు సాయప్ప, ఎర్ర కిష్టప్ప, మాధవరెడ్డి, బాలరాజు కూల్చివేతలను పరిశీలించారు. ఇదేమి ప్రజాపాలన అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తామంతా అభివృద్ధికి అడ్డుకామని.. ప్రజలకు తెలిసేలా ప్రగతి చేయాలని కోరినా అధికార పార్టీ నేతల అండదండలతో అధికారులు ఒంటెత్తు పోకడ పోతున్నారని ఆరోపించారు.