మద్దూర్, ఆగస్టు 22 : సీఎం రేవంత్రెడ్డి ఇలాకాలో పేదోడి ఇండ్లపైకి బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి.. రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేతలకు యత్నించగా.. ఓ బాధితుడు ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టాడు. ‘ఈ రాజ్యమేలెటోడు కూలిపోను’.. అభివృద్ధి చేస్తాడని ఓట్లేస్తే మా ఇండ్లనే కూల్చేస్తుండు’ అంటూ దుమ్మెత్తిపోసిన ఘటన శనివారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లికి చెందిన యాదగిరిగౌడ్ స్థానిక చౌరస్తాలో చిన్న హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు నెలల కిందట నారాయణపేట-కోస్గి-మద్దూర్-మహబూబ్నగర్ రోడ్డు విస్తరణ కోసం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అభివృద్ధి కోసమే అంటూ 50 ఫీట్ల మేర రోడ్డుకు అందరూ ఒప్పుకున్నారు.
ఈ మేరకు విస్తరణ పనులు పూర్తికాగా.. ఇండ్లు కోల్పోయిన బాధితులు విస్తరణలో పోయిన భాగాన్ని వదిలేసి మిగిలి స్థలంలో ఇండ్లు తిరిగి నిర్మించుకున్నారు. శనివారం అధికారులు మరోసారి పేదల ఇండ్లపై పడ్డారు. 72 ఫీట్ల మేర విస్తరణ చేస్తామంటూ బుల్డోజర్లతో చేరుకుని కూల్చివేతలకు దిగారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయి మిగిలిన దాంట్లో జీవనం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు ఉన్న గూడును కూడా తొలగిస్తామంటే ఎట్లా అని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది ప్రభుత్వ నిర్ణయం.. కూల్చే తీరుతామంటూ అధికారులు పేర్కొనడంతో ఓ హోటల్ నిర్వాహకుడు యాదగిరి గతంలో తన ఇంటిని కూల్చగా మిగిలిన పిల్లర్ స్తంభానికి ఉన్న వైరుతో ఉరేసుకోవడానికి యత్నించాడు. వెంటనే పోలీసులు అడ్డుకోగా ‘నన్ను అడ్డుకోవద్దు.. ఉన్న గూడు కూల్చేస్తే మేము ఏం చేయాలి? ఎలా బతకాలి సారూ..? అంతలా అభివృద్ధి చేయాలనుకుంటే మా సమాధులపై చేయండి’.. అంటూ రోదించాడు. దీంతో అధికారులు వెనక్కితగ్గి అక్కడి నుంచి బుల్డోజర్లను వెనక్కి పంపించారు. ఇదంతా సీఎం రేవంత్ ఇలాకాలో జరుగడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కూల్చివేతలే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న బాధలో ఆత్మహత్యకు యత్నించిన కొత్తపల్లి యాదగిరి కుంటుంబాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రోడ్ల విస్తరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకంపై బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అధికారుల తీరుతో సర్వస్వం కోల్పోతున్న యాదగిరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.