నిజామాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర్లు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేసేందుకు ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్లో సన్నాహక సమావేశం నిర్వహిం చి, చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రవీందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.25 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. నో పేమెంట్.. నో వర్క్.. స్లోగన్తో కార్యాచరణను సిద్ధం చేశామని తెలిపారు.
తెలంగాణలో మేఘా, నవయుగ లాంటి ఆంధ్రా కంపెనీలకు రూ.కోట్లలో బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తున్నదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి భాస్కర్రెడ్డి తెలిపారు. మిగిలిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల చెల్లింపుల్లో కాలయాపన చేయడం సరికాదన్నారు. బి ల్లుల జాప్యంతో 10 మంది కాంట్రాక్టర్లు చనిపోయారని ఆవేదన చెందారు. సమావేశంలో బీఏఐ కోకన్వీనర్లు విష్ణువర్ధన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు.