ఖైరతాబాద్, నవండబర్ 27: కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కల్లును నిషేధిస్తుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇటీవలే అక్కడ కల్లును నిషేధించిందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే మాడల్ తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారని పేర్కొన్నారు.
గతంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంది గీత కార్మికులను పొట్టనపెట్టుకున్నదని, కల్లు రవాణా చేయకుండా 767 జీవోను తీసుకొచ్చి 50 కిలోమీటర్ల పరిధి విధించి వేలాది మంది గీత కార్మికులకు అన్యాయం చేసిందని విమర్శించారు. హైదరాబాద్లో కల్లును నిషేధించి 46 మంది ఆత్మహత్యలకు కారణమైందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లడిగే హక్కులేదని, మళ్లీ ఆ పార్టీ వస్తే రాష్ట్రంలో గీత వృత్తి నిర్వీర్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ తన హయాంలో కల్లు గీత కార్మికులు, గౌడ కులస్థుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సారి కూడా గౌడలందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ సీఎంగా విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జై గౌడ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్, జీ రవీందర్గౌడ్, మధుసూదన్గౌడ్, శ్రీనివాస్గౌడ్, వెంకటరమణగౌడ్, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.