హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్ తయారీ విధానం మారాలని, లేకపోతే ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం పేదలు, సంపన్నుల భారత్గా విడిపోయిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డీ పాపారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1920-30లో ఒకశాతం ప్రజల చేతుల్లో 20శాతం సంపద ఉండేదన్నారు. 1990 నుంచి ప్రపంచీకరణ నేపథ్యంలో అసమానతలు ప్రారంభమై ఒక శాతం చేతిలో 40 శాతం, 10 శాతం చేతిలో 80 శాతం సంపద పెరిగిపోయిందన్నారు. ఉత్పాదక, మౌలిక రంగాలపై ఆధారపడాల్సిన ఆర్థిక వ్యవస్థ కేవలం స్టాక్స్, షేర్స్పై ఆధారపడి స్పెక్యులేషన్ (సట్ట వ్యాపారం)తో కృత్రిమ సంపదగా, జూదంలా తయారైందన్నారు.
అదానీ కేవలం స్టాక్ మార్కెట్ ద్వారా తన ఆదాయాన్ని పెంచుకున్నారని, దానిలో జరిగిన కుంభకోణంతో ఒకేసారి తన ఆర్థిక సామ్రాజ్యం కూలిపోయిందని కూనంనేని పేర్కొన్నారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడిందన్నారు. స్టాక్ మార్కెట్లో జిలుగుబిలుగు మెరుపులతో దేశ సంపద తగ్గిందని అంచనా వేయడం సరికాదన్నారు. పేదవారికి మరిన్ని సంక్షేమ ఫలాలు అందాలంటే వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ తయారి లక్ష్యంగా ఉండాలన్నారు.
ప్రస్తుత బడ్జెట్ రూపకల్పన అసమానతలు పెంచేవిధంగా ఉందని, అందుకు వ్యక్తీకేంద్రీకరణగా జీరో బడ్జెట్ను రూపకల్పన చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. ఆర్థిక విశ్లేషకులు పాపారావు ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్పై విశ్లేషణ చేశారు. షేర్మార్కెట్లు దేశ ఆర్థిక వ్యవస్థ మీదున్న ప్రభావాన్ని వివరించారు. అదానీని తక్షణం అరెస్ట్ చేయాలని, లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడి, ప్రభుత్వరంగ సంస్థలైన ఎల్ఐసీ, ఎస్బీఐ లాంటి సంస్థలకు తీవ్ర నష్టానికి కారణమైన అదానీని తక్షణం అరెస్టు చేయాలన్నారు. మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.