హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం సుదీర్ఘంగా సభ కొనసాగింది. ఏకంగా పదమూడున్నరగంటలకు పైగా అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చలు జరిగాయి. 13 పద్దులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం సప్లిమెంటరీ పద్దును ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రతిపాదించారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం స్పీకర్ సభను ఆదివారానికి వాయిదా వేశారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చే సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో ఉండటం లేదని, చట్టసభలు అంటే గౌరవం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పీకర్ ఆలోచన చేయాలని మంత్రి కోరారు.