హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తూ ఏటేటా బడ్జెట్ నిధులను పెంచుకుంటూ సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ ఏడాది రూ.2,90,396కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఇందులో సింహభాగం రూ.32,426కోట్ల పంచాయతీరాజ్శాఖకు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆసరా పింఛన్లకు రూ.12వేలకోట్లు, మిషన్ భగీరథకు రూ.600కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్న మాటలను సీఎం కేసీఆర్ ఆచరణలో పెడుతున్నారన్నారు. పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా తీర్చిదిద్దారని, ప్రస్తుతం తెలంగాణ పల్లెలు దేశానికి రోల్ మోడల్గా నిలుస్తున్నాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాయన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో 13 జాతీయ అవార్డులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో రూ.2వేల కోట్లు ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు.