నందికొండ, జనవరి 19 : అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక ప్రపంచానికి మహాకరుణ పరిష్కారాలను అందిస్తున్నదని, సమాజ రుగ్మతలకు బౌద్ధమే శరణ్యమని లే లడక్ మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకుడు సంఘసేన మహాధీర అన్నారు.
మహాకరుణ దివస్, ఆచార్య బుద్ధ రక్షిత మహాధీర జయంతి ఉత్సవాల్లో భాగంగా బౌద్ధ భిక్షువులతో కలిసి గురువారం నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలోని బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, జాతకపార్కు, ధ్యానవనం, అవకానబుద్ధ, వ్యూ పాయింట్, మహాస్తూపాన్ని సందర్శించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధుడి బోధనలతో మనిషి శీలవంతుడిగా, ప్రజ్ఞావంతుడిగా మారుతాడని తెలిపారు.