హైదరాబాద్, జూలై 18 (నమత్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లో నిర్మించిన ‘బుద్ధవనం ప్రాజెక్టు’కు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. లడక్లో మహాబోధి ఇంటర్నేషన్ మెడిటేషన్ సెంటర్ నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో బుద్ధవనం ప్రాజెక్టు డాక్యుమెంటరీని ప్రదర్శించగా, అది ప్రపంచ బౌద్ధ సంస్థలు, గురువులు, ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుందని వెల్లడించారు. త్వరలో కొందరు ప్రముఖులు బుద్ధవనాన్ని సందర్శించేందుకు ఆసక్తి చూపారని తెలిపారు. సదస్సులో పాల్గొన్న వారిని సదస్సు నిర్వాహకులు సతరించి, జ్ఞాపికలు అందజేశారు.