నందికొండ : బుద్ధుడి జీవిత చక్రాణి, శిల్పాల రూపంలో పొందుపరిచిన బుద్ధవనం, బుద్ధుని జీవిత చరిత్రకు నిలయమని చరిత్ర పరిశోధకుడు, బౌద్ధ నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. బుద్ధవనంలో నాలుగో రోజు టూరిస్ట్ గైడ్ల శిక్షణా కార్యక్రమంలో భాగంగా శనివారం జాతక పార్కులో బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించి శిల్పాలతో చెక్కిన 40 జాతక కథలను, దశ పారమితులను, బోధిసత్వ దశ నుంచి బుద్ధుడిగా అవతరించే క్రమాన్ని శిల్పాలతో వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనంను సందర్శించే పర్యాటకులకు, బౌద్ధులకు బుద్ధవనంలోని శిల్పాలతోనే బుద్ధుడి జీవిత చరిత్ర తెలుస్తుందన్నారు. పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేసే విధంగా ఉన్న బుద్ధుని జీవిత చరిత్ర శిల్పాల గురించి వారికి వివరించాలని టూరిస్ట్ గైడ్లకు సూచించారు. అనంతరం శ్రీలంక అవకన బుద్ధ శిల్పం, మహాస్థూపాల గురించి శిక్షణ పొందుతున్న టూరిస్ట్ గైడ్లకు బుద్ధవనం సహాయక శిల్పి శ్యామ్ సుందర్ వివరించారు.