మణుగూరు రూరల్, జనవరి 9: భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలోని చిక్కుడుగుంటలో తెలంగాణ ప్రభుత్వం 1,080 (4×270) మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో భద్రాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (బీటీపీఎస్) నిర్మిస్తున్నది. ప్లాంట్ పరిధిలో మొత్తం నాలుగు యూనిట్లు ఉండగా ఇప్పటికే మూడు యూనిట్ల పరిధిలో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఒక్కో యూనిట్ నుంచి 270 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. ఆదివారం ఉదయం 8.37 గంటలకు నాలుగో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్ (సీవోడీ) పూర్తయింది. ఇకనుంచి నాలుగు యూనిట్లో ఉత్పత్తి అయిన విద్యుత్తు రాష్ట్ర గ్రిడ్కు అనుసంధానమవుతుందని జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్టు) సచ్చితానందం తెలిపారు. నాలుగు యూనిట్ల ద్వారా రోజుకు సగటున 25 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వినియోగించే విద్యుత్తులో 8-10 శాతం బీటీపీఎస్ నుంచే సరఫరా అవుతుందని తెలిపారు.