హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) పోస్టులకు బీఏ, బీకాం, బీఎస్సీ అభ్యర్థులతోపాటు బీటెక్ పూర్తిచేసినవారూ అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది. టీజీటీ పోస్టులకు బీటెక్ చదివినవారు కూడా అర్హులేనని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని, ఆ తీర్పును ఆమోదిస్తున్నామని ప్రకటించింది. ఈ తీర్పునకు అనుగుణంగానే టీజీటీ పోస్టుల నియామకాలు జరపాలని, పాత విధానంలో నియామకాలు చేపట్టరాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఇటీవల తేల్చిచెప్పింది. ఒకవేళ అభ్యర్థులు జోనల్ పరిధిలోకి వస్తే వారిని కూడా పరిగణనలోకి తీసుకొని నియామకాలు జరపాలని ధర్మాసనం పేరొంటూ.. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను కొట్టేసింది.