అచ్చంపేట టౌన్, మార్చి 6 : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని, దీన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పరోక్షంగా కమలం పార్టీకి వత్తాసు పలుకుతున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన బీఎస్పీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం ఖాయమని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే బీఎస్పీ బీఆర్ఎస్తో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని తెలిపారు. బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు బహుజనుల ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడానికి రెండు పార్టీలు జతకట్టినట్టు వివరించారు. బహుజనులకు న్యాయం జరగాలనేది పార్టీ లక్ష్యమని, ఈ పొత్తుతో ప్రజలకు మంచి జరగబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్-బీఎస్పీ పోటీ చేసే స్థానాలపై త్వరలోనే విధివిధానాలు, కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. దేశంలో విచ్ఛిన్నకర ఎజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.