Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బెయిల్పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది కోర్టు. ఒకటి తనకు తానుగా లొంగిపోవడం. రెండోది బెయిల్ రద్దు చేయడం. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోర్టు సూచించింది. మేఘాలయకు గత ఏడాది భర్త రాజా రఘువంశీని హనీమూన్ తీసుకెళ్లిన సోనమ్ రఘువంశీ.. అక్కడ అతడిని హత్య చేయించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అరెస్టైన సోనమ్ ప్రస్తుతం బెయిల్పై విడుదలైంది. మొదట మేఘాలయ ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని ప్రభుత్వం సవాలు చేస్తూ మేఘాలయ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు కూడా ఆమె బెయిల్ను సమర్ధించింది. దీంతో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలే ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. దీనిపై మంగళవారం సోనమ్ తరఫు న్యాయవాదికి కీలక సూచనలు చేసింది. రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి ప్రభుత్వం కోరుతున్నట్లు సోనమ్ బెయిల్ రద్దు చేయడం.
రెండోది.. ఆమె తనకుతానుగా కోర్టులో లొంగిపోయి, విచారణకు సహకరించడం. దీనిపై స్పందించిన సోనమ్ తరఫు న్యాయవాదులు ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు గురువారం వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఇదే సమయంలో అరెస్టు తర్వాత బెయిల్పై ఉన్న సోనమ్ ప్రవర్తన గురించి వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్గా తుషార్ మెమతా వ్యవహరిస్తున్నారు. సోనమ్ బెయిల్ రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు. సోనమ్ తనకుతానుగా పోలీసుల ఎదుట లొంగిపోయిందని, అందువల్ల అరెస్టుకు సరైన కారణాలు లేవన్న సాకుతో బెయిల్ కావాలని ఆమె కోరలేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
అరెస్టు సమయంలో ఆమెకు జారీ చేసిన మెమోలో ఏదైనా లోపం ఉంటే, అది క్లరికల్ పొరపాటు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాజా రఘువంశీ కుటుంబం డిమాండ్ చేస్తోంది.