హైదరాబాద్, జూలై10 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో బహుజన బిడ్డలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతుంటే పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా మూసీ ప్రాజెక్టు కోసం రూ.7345 కోట్లు కేటాయించడం దారుణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ నిప్పులు చెరిగారు.
బహుజన విద్యార్థుల కంటే మూసీ డెవలప్మెంటే అంత ముఖ్యమా? అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ ప్రక్షాళన కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.