(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): బీఎస్ఎన్ఎల్ను ప్రైవేట్పరం చేయడానికి, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడ్డారు. సర్వీస్ లెవెల్ పేరుతో 25 ఏండ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో కొత్త వేతన ఒప్పందంపై సంతకాలు చేయించుకుందని ఆరోపించారు. పీఎఫ్, గ్రాట్యుటీ లాంటివన్నీ రద్దు చేసి తక్కువ జీతాలతో తమను వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కోల్కతాలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రాష్ర్టాల బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టు ఉద్యోగుల సదస్సు జరిగింది. 50 వేల మందిని తొలగించాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పావులు కదుపుతున్నదని సీఐటీయూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి అనాది సౌ ఆరోపించారు. బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ లేబర్స్ యూనియన్ సెక్రటరీ జనరల్ అనిమేష్ మిత్రా మాట్లాడుతూ పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగుల ఒప్పందాలు మార్చుతూ అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కనీస వేతనం, పీఎఫ్, గ్రాట్యుటీ కూడా లేకుండా చేశారని ఆన్నారు. ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.5 వేల జీతం చెల్లిస్తున్నదని అన్నారు.