హైదరాబాద్ : కర్నాటకలో ఐదు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం చేస్తున్న అసత్య హామీలు, తప్పుడు వాగ్ధానాలను నమ్మవద్దని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నాటక మోడల్ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల మోడల్గా ప్రచారం చేసుకుంటున్నారని, కానీ అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు.
గ్యారంటీ పధకాలను అమలు చేయడంలో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. తెలంగాణలో ఆ పార్టీ ప్రచారం చేస్తున్న ఆరు గ్యారంటీ స్కీమ్లు రాష్ట్రంలో ఓటర్లను మోసగించేందుకేనని, కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు, అసత్యాలను నమ్మి మోసపోవద్దని తాను తెలంగాణ ప్రజలను కోరుతున్నానని యడియూరప్ప అన్నారు.
యువనిధి పధకం ఇంతవరకూ తమ రాష్ట్రంలో వెలుగుచూడలేదని, గృహ లక్ష్మి కింద ప్రకటించిన నగదు తమ ఖాతాల్లోకి చేరలేదని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. మహిళకు ఉచిత బస్ ప్రయాణం హామీని సరిగ్గా అమలు చేయడం లేదని, బస్సుల సంఖ్యను కుదించారని అన్నారు. 200 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆపై అధికారంలోకి రాగానే గత 12 నెలల్లో సగటున 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్నవారికే ఉచిత్ విద్యుత్ వర్తింపచేస్తామనే నిబంధన విధించిందని యడియూరప్ప పేర్కొన్నారు.
Read More :