సంగారెడ్డి, మే 18: హైదరాబాద్ ఐఐటీ వినూత్న పరిశోధనలకు కేంద్రంగా మారిందని, దేశంలోని ప్రముఖ కంపెనీలు, ఇన్స్టిట్యూట్లు తమతో ఒప్పందాలు చేసుకోవడం గర్వంగా ఉన్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం డైరెక్టర్ మూర్తి ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. విద్యార్థుల మార్పిడి, ఫ్యాకల్టీ ఎక్సేంజీ, పరిశోధనలో మార్పిడి, ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టడం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమాలపై ఎంవోయూ కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఎస్సీటీఐఎంఎస్టీ.. ఐఐటీతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందని అన్నారు. వాస్తవంగా ఐఐటీ హైదరాబాద్తో ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడితోపాటు పరస్పర ఆసక్తి పరిశోధన రంగంలో సహకరించడానికి బయో-మెడికల్ ఇంజినీరింగ్, మెడికల్ డివైజ్ ఇన్నోవేషన్ సంబంధిత రంగాల్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన రెండు సంస్థలు ఇప్పటికే కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
ఈ ఒప్పందం రెండు ఇన్స్టిట్యూట్ల మధ్య బలమైన సంబంధాన్ని నిర్ధారిస్తున్నదని, అకడమిక్ అండ్ రిసెర్చ్ ఫ్రంట్లో పాత్ ట్రాకింగ్ ఇన్నోవేషన్కు మార్గం సుగమం చేస్తున్నదని తెలిపారు. బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం, బయోటెక్నాలజీ విభాగం, హెల్త్కేర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కేంద్రం, ఏఐజీ దవాఖానతో మెడికల్ డివైజ్ ఇన్నోవేషన్లో ఇంటర్ డిసిప్ల్లీనరీ ఎంటెక్, ఎల్వీపీఈఐతో ఆప్తాల్మిక్ ఇంజినీరింగ్తో ఎంటెక్-మెడికల్లో ఎమ్మెస్సీ వంటివి ప్రవేశపెట్టినట్టు డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. బసవతారకం దవాఖానతో భౌతికశాస్త్రం, ఎస్సీటీఐఎంఎస్టీతో ఈ వ్యూహాత్మక సహకార ఒప్పందం ఆరోగ్యరంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నదని తెలిపారు.