చిగురుమామిడి, ఆగస్టు 15: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే భార్యను హతమార్చాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో సోమవారం కలకలం రేపింది. ఇందుర్తి అంగన్వాడీ కేంద్రం-2లో కనకం శిరీష (30) ఆయాగా విధులు నిర్వహిస్తున్నది. భర్త ప్రవీణ్తో కలహాల కారణంగా కొడుకు (10), కూతురు(8)ని అతడి వద్దే వదిలి శంకరపట్నంలోని పుట్టింట్లో ఉంటున్నది. ఇటీవల ప్రవీణ్కు విడాకుల నోటీసులు పంపించింది.
కొద్దిరోజులు సెలవులో ఉన్న శిరీష.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రవీణ్ అక్కడిక వెళ్లి ఇంటికి రావాలని శిరీషపై ఒత్తిడి చేశాడు. పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశాక వస్తానని చెప్పినా వినకుండా ఆగ్రహంతో అందరూ చూస్తుండగానే ప్రవీణ్ ఆమెను మెడపై కత్తితో నరికి దారుణంగా హతమార్చాడు. ఘటనా స్థలాన్ని తిమ్మాపూర్ సీఐ శశిధర్రెడ్డి, చిగురుమామిడి ఎస్ఐ సుధాకర్ పరిశీలించారు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.