Kamareddy | నిజామాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొందరు ఓ దళిత మహిళను వివస్త్రను చేసి జననాంగాల్లో కారం కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. గ్రామంలో నడిబజారులో అందరు చూస్తుండగానే చెట్టుకు కట్టేసి కొట్టారు. మూడు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. రామారెడ్డి మండలానికి వలస వచ్చి బతుకుతున్న జంటపై తొలుత దాడి చేశారు.
ఇక్కడ్నుంచి మాచారెడ్డి మండలంలోని మరో గ్రామానికి బాధిత జంటను పట్టుకెళ్లి అక్కడే చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడగా మరుసటి రోజు వారిని కొందరు దవాఖానకు తీసుకెళ్లినట్టు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో చెలరేగిన వివాదంతో ఇదంతా జరిగినట్టు సమాచారం. అయితే, ఈ దారుణంపై పోలీసులు నోరు మెదపడం లేదు. దాడికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీకి చెందినవారని గ్రామస్థులు చెప్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటన బాహ్య ప్రపంచానికి తెలిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో పోలీసులు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. రామారెడ్డి, మాచారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అమానవీయ ఘటనపై కేసు నమోదు చేశారా.. లేదా? అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు స్పందించడం లేదు.