సిద్దిపేట, జనవరి 4 : సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి ఆర్చ్ ఫార్మా కంపెనీలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ గెలుపొందింది. బీఆర్టీయూ నుంచి పోటీ చేసిన మారెడ్డి రవీందర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీఎంఎస్ అభ్యర్థి పైవిజయం సాధించారు. గురువారం సాయంత్రం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్టీయూ విజయం సాధించడంతో ఆర్చ్ ఫార్మా కంపెనీ వద్ద కార్మికులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. మొత్తం 57 ఓట్లకు గాను 55 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో బీఆర్టీయూ అభ్యర్థి మారెడ్డి రవీందర్రెడ్డికి 28 ఓట్లు, బీఎంఎస్ అభ్యర్థికి 27 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు తేడాతో బీఆర్టీయూ అభ్యర్థి విజయం సాధించారు. ఈ సందర్భంగా మారెడ్డి రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. 13 ఏండ్లుగా ఆర్చ్ ఫార్మా కంపెనీలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధిస్తున్న బీఎంఎస్ కంచుకోటను బద్ధ్దలు కొట్టినట్టు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.