Group-1 | హైదరాబాద్ : గ్రూప్ – 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నిరుద్యోగ విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసన తెలిపింది. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదు.. గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జీవో నెం 29 రద్దు చేయాలి జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలి. గ్రూప్ -1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు.
గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదు. గ్రూప్ -1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్వీ పోరాటం చేయక తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని కడారి స్వామి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు చటారి దశరథ్, జంగయ్య, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, రాకేష్, సాయి గౌడ్, సంజయ్, రాము తదితర విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.