హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ‘బండి సంజయ్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి.. మైనర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి’ అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద ఆదివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని బండి సంజయ్ వైఖరిపై నిరసన తెలిపారు. తన కొడుకు చేసిన పనిని బండి సమర్థించడం అన్యాయమని గెలు శ్రీనివాస్యాదవ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఓ మైనర్ను వేధింపులకు గురిచేయడంపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.
భగీరథ్పై కేసు నమోదు చేయకుండా పోలీసులపై బండి సంజయ్ ఒత్తిడి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి కూడా సహకరించారని ఆరోపించారు. భగీరథ్ను అరెస్ట్ చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని బీఆర్ఎస్వీ మహిళా నాయకురాలు మనీష విమర్శించారు. డీజీపీ కార్యాలయం గేట్ల వద్ద కూర్చొని నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్, తుంగబాలు, స్వామియాదవ్, వెంకట్గౌడ్, రాజేశ్నాయక్, జంగయ్య, మిథున్, శ్రీకాంత్, అవినాశ్, నితీశ్, రాహుల్, విశాల్, క్రాంతి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.