MLA Gandra Venkata Ramana Reddy | రేగొండ, మే 28: తెలంగాణలో ఎన్నిక ఏదైనా విజయం బీఆర్ఎస్దేనని, గులాబీ సైన్యాన్ని చూస్తేనే ప్రతిపక్ష నాయకుల్లో గుబులు పుడుతుందని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ దేశంలో రైతు రాజ్యస్థాపనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అవతరించిందన్నారు. కార్యకర్తలే పార్టీ రథ చక్రాలని, నాయకులు, ప్రజాప్రతినిధులు కేవలం రథ సారథులేనని పేర్కొన్నారు.
సబ్బండ వర్గాల ప్రజల ఆభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిరంతరంగా పని చేస్తూ రాష్ట్రాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేశాడని, అదే స్ఫూర్తితో దేశాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో అభివృద్ధిని జీర్ణుంచుకోలేక తప్పుడు ప్రచారలు చేస్తున్నారని, ఇప్పటికైనా మానుకోవాలన్నారు. లేకుంటే తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందన్నారు. కార్యకర్తలు వారి విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో బీజేపీ, కాంగ్రేస్ పాలనలో రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదని, ఆయన ప్రశ్నించారు. ప్రతి పక్షాల నేతలకు గ్రామాలకు రావడానికి ముఖం లేదని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్వోతి మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను వెన్ను తట్టేలా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో వారిలో నూతన ఉత్తేజం నెలకొందన్నారు. ప్రతి పక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొడుతూ ప్రభుత్వ పథకాల అమలును ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు వర్గ విభేదాలు వీడి పార్టీ పటిష్టత కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.