మేడ్చల్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి రైతుల ఓట్లు అడిగే హక్కు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చారా? క్వింటాకు రూ.500 బోనస్ అమలు చేశారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేటలో మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీలోకి వెళ్లే మొదటి జంప్జిలానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ప్రధాని మోదీని చౌకీదార్ అంటుంటే, రేవంత్రెడ్డి మాత్రం బడాభాయ్ అంటున్నారని దుయ్యబట్టారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే, రేవంత్రెడ్డి మాత్రం అలయ్ బలయ్ చేసుకుంటున్నారని విమర్శించారు. లిక్కర్స్కామ్ లేదని రాహుల్ అంటుంటే, రేవంత్రెడ్డి మాత్రం లిక్కర్స్కామ్ ఉన్నదని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను గుజరాత్ మాడల్ చేస్తామంటున్న రేవంత్ వైఖరి చూస్తుంటే ఆయన రాహుల్గాంధీ కోసం పనిచేస్తున్నాడా? మోదీ కోసం పనిచేస్తున్నాడా? అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు.
మందికి పుట్టిన బిడ్డలను తన బిడ్డలుగా చెప్పుకుంటున్న తీరుగా రేవంత్ వ్యవహారం ఉన్నదని, మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడమే ఇందుకు నిదర్శనమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మూడు నెలల్లోనే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారో, పరీక్షలు ఎప్పుడు నిర్వహించి, ఫలితాలు ఎప్పుడు వెల్లడించారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైనవారిని తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయాలేదంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. ఈటల ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్లు, మరో దఫాలో రూ.14 వేల కోట్లు మాఫీ చేసిందని గుర్తుచేశారు. తాము రైతుల రుణాలను మాఫీ చేస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం పదేండ్లలో కార్పొరేట్ శక్తులకు రూ.14.30 కోట్ల రుణాలను మాఫీ చేసిందని విమర్శించారు. కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయకుండా జైశ్రీరాం నినాదంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
యాదగిరిగుట్టను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తీర్చిదిద్దామని, దీనిపై తాము ఎలాంటి ప్రచారం చేసుకోలేదని చెప్పారు. మతపరమైన రాజకీయాలు చేయొద్దని బీజేపీకి హితవు చెప్పారు. అసలైన సెక్యులర్ పార్టీ అంటే బీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసే అవసరం తమకు లేదని, కాంగ్రెస్ నాయకులే కూలదోసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మానవబాంబులు ఉన్నారన్న విషయాన్ని రేవంత్ గుర్తించాలని చురకలేశారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.