Telangana | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకొనేందుకు ఈ నెల 28 నుంచి ‘ప్రజాపాలన’ పేరుతో గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజావాణి తరహాలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం వచ్చేనెల 6 వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంపై విస్తృతంగా చర్చించి, విధివిధానాలు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) ఉదయం 8.30 గంటలకు రావాలని రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2,202 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ఇందులో సుమారు 40% డబుల్ బెడ్రూం, 30% పెన్షన్లకు సంబంధించినవి, మిగతావి ఉద్యోగాలు, రెవెన్యూ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయని వివరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్లో స్వయంగా కారు నడుపుతూ పలువురి దృష్టిని ఆకర్షించారు. అదే కారులో ఆయన పక్కన మాజీ మంత్రి హరీశ్రావు కూడా కూర్చోవడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్లో బస చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం బొల్లారంలోని తన నిలయంలో రాష్ట్ర ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు.
రాష్ట్రపతి ఆహ్వానం మేరకు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణభవన్ నుంచి బొల్లారం బయలుదేరారు. కేటీఆర్ తెలంగాణభవన్ నుంచి బయలుదేరే సమయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కారులో (డిఫెండర్) వెళ్లారు. తానే డ్రైవ్ చేస్తానని కేటీఆర్ పేర్కొనడంతో అప్పటిదాకా ఉన్న డ్రైవర్ ఆయనకు స్టీరింగ్ ఇచ్చారు. డ్రైవర్ సీట్లో కేటీఆర్, ఆయన పక్కన హరీశ్రావు కూర్చున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వరకు కేటీఆరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ‘కృష్ణార్జునుల స్పెషల్’ అని వైరల్ కావడం విశేషం.
శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్హోమ్ కార్యక్రమానికి మాజీమంత్రి తన్నీరు హరీశ్రావును కారులో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు.
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఎట్హోం (తేనీటి విందు)కు కేటీఆర్, హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు మన్నె శ్రీనివాస్రెడ్డి, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, కోవ లక్ష్మి, విజేయుడు, లాస్య నందిత, మాణిక్రావు, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, తక్కళ్లపల్లి రవీందర్రావు, శంభీపూర్ రాజు, దండె విఠల్, నవీన్కుమార్ తదితరులు హాజరయ్యారు.