KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది. దక్షిణ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక పరిణామాలపై తమ అభిప్రాయాలను ఈ సదస్సులో కేటీఆర్ పంచుకోనున్నారు.
‘సదరన్ రైజింగ్ సమ్మిట్’ మూడో ఎడిషన్ ఈసారి “భవిష్యత్తుకు సిద్ధం: ఆవిష్కరణ, పరివర్తన, స్ఫూర్తి” (Ready for the Future: Innovation, Transformation, Inspiration) అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరగనుంది. ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, విద్య, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలలో దక్షిణ రాష్ట్రాలు ఈ విధంగా ముందుకు సాగుతున్నాయో అంశంపై చర్చించడానికి ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమలు మరియు పౌర సమాజానికి చెందిన ప్రముఖులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది.
ఏబీపీ నెట్వర్క్ తమ ఆహ్వానంలో కేటీఆర్ వంటి నాయకులు పాల్గొనడం కేవలం తెలంగాణకే కాకుండా, యావత్ భారతదేశానికి దిశా నిర్దేశం చేయడంలో దోహదపడుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తెలంగాణ సాధించిన ప్రగతి, భారతదేశ వృద్ధిలో దక్షిణ రాష్ట్రాల పాత్ర.. అలాగే తయారీ , ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆవిష్కరణల ఆధారిత రంగాలలో వస్తున్న కొత్త అవకాశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.