KTR | నర్సంపేట : మా ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరమయ్యాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచి కూడా వారికి దూరమయ్యాం. ఇలా చేసింది చెప్పుకోలేక ఓడిపోయామన్నారు కేటీఆర్. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
ఈ ఎన్నికలతో ఫలితంలో ప్రభుత్వం కూలిపోయేది లేదు. తారుమార అయ్యేది లేదు. 6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్తో సహా అందరం ప్రతి నియోజవర్గంలో పర్యటించాం. దయచేసి మోసపోకండి.. గోసపడుతామని చెప్పాము. కానీ ప్రజలు కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
చదువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పాలన గురించి ఆలోచించాలని కోరుతున్నాను. ప్రస్తుతం వ్యవసాయం పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అందమైన నినాదాలు ఎక్కడున్నాయో ఆలోచించండి. నాకు ఓటు వేస్తే 2 లక్షల రుణమాఫీ దస్త్రంపై డిసెంబర్ 9న తొలి సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అర్జంట్గా బ్యాంక్కు వెళ్లి 2 లక్షల రుణం తెచ్చుకోవాలని కూడా సూచించారు. డిసెంబర్ 9 పోయింది.. మరో పది రోజులు అయితే జూన్ 9 వస్తది. ఆరు నెలలు గడిచిపోతది. తొలిరోజే సంతకం చేస్తానని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించాలని గ్రాడ్యుయేట్లను కేటీఆర్ కోరారు.
రైతు భరోసా 15 వేలు ఇస్తా.. భూయజమాలకు కాదు కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తానని రేవంత్ నమ్మబలికాడు. రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తానని అన్నాడు. కౌలు రైతులకు రైతు భరోసా రాలేదు. తొలిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పు. రెండోసారి కూడా వాడి చేతిలో మోసపోతే మనది తప్పు అయితదని కేటీఆర్ అన్నారు.