KTR | దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి ₹ 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు అప్పగించారని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు ₹ 1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు దక్కిందని చెప్పారు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం.. దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటదా అని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్ ఇద్దరి బాగోతం నేను బయటపెట్టడంతో కుడిదిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట అని విమర్శించారు. హెచ్సీయూ భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న.. లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారని అన్నారు. నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైందని అన్నారు. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కు పనికి రాని కథలు చెబుతుండ్రు అని విమర్శించారు.
రూల్స్ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని సీఎం రమేశ్ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. నీ దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. 1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయిందని విమర్శించారు. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేశ్ – సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే.. HCU ₹ 10000 కోట్ల స్కాం పైనా.. 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండిటిపైనా కలిసి చర్చ కు సిద్ధమని సవాలు విసిరారు.