KTR | నర్సంపేట : ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టెట్ పరీక్ష ఫీజు రూ. 20 వేలు చేస్తరు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గళాన్ని మండలికి పంపించాలి అని కేటీఆర్ కోరారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. 50 వేలతో మెగా డీఎస్సీ అన్నాడు. ఈ రెండు అమలు కాలేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నారు. అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు. లీగల్ సమస్యల వల్ల ఆగిపోయాయి. కేవలం కాగితాలు ఇచ్చి తాను ఇచ్చానని ఊదరగొడుతున్నారు. విచక్షణ కలిగిన విద్యావంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. సమాజానికి దిక్సూచిగా ఉంటూ, దిశానిర్దేశం చేసేది మీరే.. మీరు కూడా మళ్లీ మోసపోతారా..? లేదా మేల్కొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి అవకాశం ఇస్తారా..? ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ తరపున రాకేశ్ రెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. రాకేశ్ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో వంగపహాడ్లో జన్మించారు. బిట్స్ పిలానీలో చదివి గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికాలో లక్షల జీతం వదిలేసుకుని పుట్టిన గడ్డకు సేవ చేయాలని సొంతగడ్డకు చేరుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.
తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, వెకిలి పనులు చేసుడు కాంగ్రెస్ అభ్యర్థి లక్షణం. దందాలు చేయడం, బెదిరించడం వంటి కేసులు నమోదైనట్లు కాంగ్రెస్ అభ్యర్థి అఫిడవిట్లో ఉన్నాయి. తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆడపిల్లల ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, అనుమతి లేకుండా అమ్మాయిల ఫోన్ నంబర్లను ఫేస్బుక్లో పెట్టిన కేసులు, బ్లాక్ మెయిల్ చేసిన కేసులు.. ఇలా 56 క్రిమినల్ కేసులు ఉన్న మహానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి అభ్యర్థుల గుణగణాలు చూడాలి. మండలిలో వైట్ కాలర్ వర్కర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిలర్ ఉండాల్నా ఆలోచించండి. ఈ ఒక్క సీటుతో గవర్నమెంట్ రాదు.. పోదు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నర్సంపేట యువత తరపున రేపు మండలిలో గల్లా పట్టి అడిగే పరిస్థితి మాత్రం ఉంటది. 2 లక్షల ఉద్యోగాలు, నోటిఫికేషన్లు ఎక్కడా అని అడిగే హక్కు ఉంటది. నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ ఉంటది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా, విద్యావంతులుగా మోసాన్ని గ్రహించి ఓటేయకపోతే నష్టపోయేది మీరే. నోటిఫికేషన్లు ఇవ్వకపోపోయిన పట్టభద్రులు ఓటేశారు అని ప్రభుత్వం అనుకుంటది. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా మాకు ఓటేశారు అనుకుంటారు. ఒక్క పరీక్షకు కూడా ఫీజు ఉండదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ ఫీజు రూ. 400 ఉండే. ఇప్పుడు రూ. 2 వేలు అయింది. మళ్లీ వాళ్లకు ఓటేస్తే టెట్ ఫీజు రూ. 20 వేలు చేయరా..? ఆలోచించండి. పదేండ్లలో తెలంగాణలో ఎంతో ప్రగతి సాధించాం. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయి. ఐటీ ఎగుమతులు పెరిగాయి. పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.