KTR | ఆదిలాబాద్ : కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచరట.. కానీ కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇష్టమొచ్చినట్లు పిల్లలను కన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెంచుతారట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
2026లో దేశం మొత్తం కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. శాసనసభ నియోజకవర్గాలు పెరుగుతాయి. పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా లెక్క ప్రకారం పెరగాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచనను కొంతమంది విలేకర్లు పేపర్లలో రాశారు. 1970, 1980లో భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతుందని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని నాటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మేమిద్దరం.. మాకు ఇద్దరు.. ఈ స్లోగన్తో కుటుంబ నియంత్రణ చేయమని ఆదేశించారు.
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు కుటుంబ నియంత్రణ పాటించాయి. ఉత్తరాదిన ఉండే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కేంద్రం మాట వినలేదు. అక్కడ్నేమో జనాభా పెరిగింది. అయితే ఎక్కడ జానాభా పెరిగితే అక్కడ సీట్లు పెంచుతామని అంటున్నారట. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా కుటుంబ నియంత్రణ పాటించి దేశం కోసం పిల్లలను కనకుండా ఉంటే.. ఇక్కడేమో సీట్లు తగ్గిస్తారట. ఉత్తరాదిన ప్రభుత్వం మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు పిల్లలను కని పేదరికం పెంచిన రాష్ట్రాల్లోనేమో సీట్లు పెంచుతారట అని కేటీఆర్ తెలిపారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎందుకు ఉండాలని కొంతమంది అంటున్నారు. రేపటి రోజున తెలంగాణలో పార్లమెంట్ సీట్లు తగ్గిస్తే.. అప్పుడు కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. కాంగ్రెస్, బీజేపీ సన్నాసులు ఢిల్లీ వాళ్లు. నోరు కూడా మెదరపరు పార్లమెంట్లో. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే అది బీఆర్ఎస్ గులాబీ జెండాతోనే సాధ్యమవుతుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.