KTR | హైదరాబాద్ : రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పుకోరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తాను చేసింది ఏమీ లేకపోవడంతోనే రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని అందుకే జూబ్లీహిల్స్ అనేక తన ప్రభుత్వానికి పరిపాలనకు తనకు రెఫరెండం కాదు అని చెప్పారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తన పరిపాలన పైన నమ్మకం లేకనే ప్రజల్లో నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం కాదు అని చెప్పారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు చేసిన వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అన్నమాట స్పష్టమైనది అన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్లో రోడ్డు షో నిర్వహించిన కేటీఆర్ రేవంత్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో చేసిన అనేక వ్యాఖ్యలపైన గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 నెలల కాలంలో చేసింది ఏమీ చెప్పుకోవడానికి లేకపోవడంతోనే పాత కాలం కథలు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన 24 నెలల పాలన కాలంలో చేసిన అభివృద్ధిని చూపించి సంక్షేమ పథకాల అమలు చూపించి ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు అని…సబ్బండ వర్గాలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశారన్నారు. రెండు సంవత్సరాల పరిపాలనలో మోసం చేసిన విద్యార్థులు యువకులు రైతన్నలు పారిశ్రామికవేత్తలకు చేసిన మోసాన్ని చూసినందుకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు ఓటు వేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. రెండు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నగరాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లినందుకు నగర ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో గెలిస్తే అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలపైన కేటీఆర్ మండిపడ్డారు. గతంలో ఇవే మాటలు చెప్పి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మేము అడిగితే రేవంత్ రెడ్డి తనకు సంబంధంలేని గత ప్రభుత్వపు కాంగ్రెస్ పరిపాలన చూసి ఓటు వేయాలని అడగడం పైన కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత పది సంవత్సరాల కాలంలో ఐటీ పరిశ్రమ నుంచి మొదలుకొని టిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణము ప్రజారోగ్యం, రోడ్లు, ఫ్లై ఓవర్లు, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, 47 ఫ్లై ఓవర్లు రోడ్ల నిర్మాణం, రాష్ట్రాన్ని ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడం వంటి అన్ని రంగాల్లోనూ గత ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ సర్కారు హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపింది అన్నారు.
కానీ రేవంత్ రెడ్డి గత రెండు సంవత్సరాలలో హైదరాబాదు నగరాన్ని పూర్తిగా పతనావస్థకు చేర్చి రియల్ ఎస్టేట్ నుంచి మొదలుకొని ఆటో డ్రైవర్ల వరకు అందరి ఉపాధి అవకాశాల పైన దెబ్బకొట్టి అనేక వర్గాలు ఆత్మహత్యలకు పాల్పడేలా రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల పరిపాలన సాగిందన్నారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి అరాచకం చేశారని వేలాదిమంది పేదల ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళ అక్రమాల జోలికి వెళ్లలేదని కేటీఆర్ విమర్శించారు. కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుంటూ వారి ఇళ్లను కూలగొడుతున్న హైడ్రా బుల్డోజర్ పేద వాళ్ళ ఇంటికి బస్తీల జోలికి రావద్దు అంటే 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా మంత్రులు అక్రమంగా నిర్మాణం చేసుకున్న ఫామ్ హౌస్లను ఇళ్లను కేటీఆర్ తన రోడ్డు షోలో అందరికీ అర్థం అయ్యేలా ఎల్ఈడి స్క్రీన్ లపై చూపించారు. హైడ్రా గురించి గొప్పగా చెప్పుకున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిగ్గు ఉంటే తన మంత్రుల అడ్డగోలుగా అక్రమంగా కట్టుకున్న ఈ నిర్మాణాలను తొలగించాలని కేటీఆర్ సవాలు చేశారు. హైడ్రా వలన ఒక్కరికి కూడా లాభం జరగలేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి నిజాయితీ లేని మాటలు మాట్లాడుతున్నారని.. నేతి బీరకాయలో నెయ్యి అంతా నిజాయితీ రేవంత్ రెడ్డి మాటల్లో ఉంటాయని ఎద్దేవా చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే…గ్యారంటీలు అమలు చేయకుండా తమకే ఓటు వేశారని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి భావించి హామీలను అమలు చేయడాన్ని ప్రారంభించాలని కేటీఆర్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుతో తెలంగాణ ప్రజలందరికీ హామీలు అమలు కావాలని ఆ దిశగా కాంగ్రెస్ను ఓడించి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండేళ్లపాటు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను పీల్చుకుతింటున్న అరాచకానికి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కనిపించిన కాంగ్రెస్ను తరమవలసిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరును ఎత్తే నైతిక అర్హత లేదని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీ రామారావుని పదవి నుంచి తొలగించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి పెట్టిన ఎన్టీఆర్ పేరును తొలగించి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టిందన్నారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావుకు అహంకారం అంటూ ఎన్టీఆర్ను తూలనాడుతూ రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. తన జీవితమంతా వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ గనుక ఎన్టీ రామారావు విగ్రహాలు పెడితే ఆయన ఆత్మ చూపిస్తుందని కేటీఆర్ అన్నారు.