KTR | హైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో జయకేతనం ఎగరేసి సత్తాచాటిన తెలంగాణ తేజాలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 11వ ర్యాంకు సాధించి నారీశక్తిని చాటిచెప్పిన వరంగల్కు చెందిన ఎట్టబోయిన సాయి శివానీకి ప్రత్యేకంగా అభినందనలు. మీ గెలుపు యావత్ తెలంగాణకే గర్వకారణం అని కేటీఆర్ కొనియాడారు.
46 ర్యాంకు సాధించిన రావుల జయసింహారెడ్డికి, 62వ ర్యాంకు సాధించిన శ్రావణ్ కుమార్ రెడ్డికి, 68వ ర్యాంకుతో సత్తా చాటిన సాయి చైతన్య జాదవ్ తోపాటు.. అగ్రభాగాన నిలిచిన వారందరికీ కేటీఆర్ కంగ్రాట్స్ తెలిపారు. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు.. అలుపెరగని దీక్షా, పట్టుదలతో మీరు సాధించిన ఈ అసాధారణ విజయం ఎంతో మంది యువతీ యువకులకు స్ఫూర్తిదాయకం. అత్యున్నత సర్వీసులో చేరబోతున్న మీరు, మన దేశ ప్రగతికి, పేద ప్రజల అభ్యున్నతికి కృషిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.