KTR | మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపించారు. సీఎం ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ధి చేకూర్చారో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలలో కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 23 సార్లు చక్కర్లు కొట్టారని కేటీఆర్ అన్నారు. ఇందులో ప్రజల ప్రయోజనం ఏముందో, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనల కారణంగా రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నో లెక్కలు ప్రకటించాలని కోరారు. కనీసం మీరు పెట్టిన ఫ్లైట్ ఛార్జీల ఖర్చంత నిధులైనా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ పర్యటనలు ప్రజల కోసమా? లేదంటే మీ అధిష్టానాన్ని మెప్పించడానికా? ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీలో కొల్లగొట్టే వేల కోట్ల రూపాయల లెక్క చెప్పేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. పేదల గూడు కూల్చేందుకు రాహుల్ గాంధీతో, అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. రాష్ట్ర పాలన గాలికి వదిలి గాలిమోటర్ ఎక్కుతున్న రేవంత్ తీరుపైన కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల అవసరాలను పక్కన పెట్టి చిటికి మాటికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండటం చూస్తుంటే ప్రజలకు మంచి చేయటం కన్నా ఢిల్లీ బాసులకు జై కొడితే తన సీటుకు ఎలాంటి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లున్నట్లు ఉన్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి పది నెలల పాలనలో తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. అటు ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పాలనపై సంతోషంగా లేనందునే పదే పదే పిలుస్తూ ఆయనకు చీవాట్లు పెడుతున్నట్లుందని విమర్శించారు. కేవలం పది నెలల కాలంలోనే ఇన్ని సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారంటే ఇదే లెక్కలో ఐదేళ్లలో మరో 125 సార్లు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోందన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఢిల్లీకి గులాంగిరి చేసేందుకు కాదు…పేదలకు మంచి చేసేందుకన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఢిల్లీకి గులాంగురి తప్పదని తాము ఎన్నికలకు ముందే చెప్పామని…ఇప్పుడు అదే జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ బాసులకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ముఖ్యమంత్రి జీ హుజూర్ అంటూ హస్తినాకు వెళ్తున్నారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడమేనంటూ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మొదట్లో సీఎం ఢిల్లీ పర్యటనల పై విమర్శలు రావటంతో చాలా తెలివిగా కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామని నమ్మబలికారని కేటీఆర్ గుర్తు చేశారు. మరి ఎంత మంది కేంద్రం పెద్దలను కలిసి రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు తెచ్చారో కచ్చితంగా చెప్పాల్సిన అవసరముందని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లినప్పటికీ కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. మోదీని బడే భాయ్ అన్న మీరు మీ బడే భాయ్ని ఒప్పించి ఎన్ని వేల కోట్లు తెచ్చారో రాష్ట్ర ప్రజల ముందుంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో, మొన్నటి వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.
కేవలం ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసేందుకు రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ మీరు వేసుకున్న ముసుగు ప్రజలకు తెలుసని కేటీఆర్ అన్నారు. పదే పదే పాలనను గాలికి వదిలి ఢిల్లీకి వెళ్తున్న అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇకనైనా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలను పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసే పనిలో నిమగ్నం కావాలని సూచించారు. ఇకనైనా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడం మాని ఓట్లేసి గెలిపించిన ప్రజలకిచ్చిన హమీల అమలుపైన దృష్టిసారించాలని హితవు పలికారు.