KTR | హైదరాబాద్ : మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరూ పొలిటికల్ టూరిస్టులు అని, మే 13 తర్వాత మళ్లీ వారు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మాట్లాడారు.
మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిది ఈ ఊరు కాదు. ఆమెది తాండూరు. వాస్తవానికి చేవెళ్ల సీటు అడిగితే బలవంతంగా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి సీటు కట్టబెట్టారు. ఆమె కూడా బలవంతంగానే ప్రచారం చేస్తోంది. ఆమె ఓడిపోతే మళ్లీ తాండూరు వెళ్లాల్సిందే. ఇక ఈటల రాజేందర్ది కూడా మల్కాజ్గిరి కాదు. ఆయన హుజురాబాద్ వెళ్లిపోవాల్సిందే. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాత్రం లోకల్. ఉప్పల్లోనే ఉంటాడు. మీ మధ్యలోనే ఉండే వ్యక్తి. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
ఐదు నెలల కింద మస్తు మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకు స్కూటీలు, తులం బంగారం ఇస్తా అన్నాడు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నాడు. కానీ ఏ ఒక్కటీ కూడా అమలు కాలేదు. ఐదు నెలల నుంచి చిల్లర మాటలు ఉద్దెర మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ పిచ్చోడి చేతిలో రాయిలా తయారైంది. సినిమాలో విలన్ డైలాగులు తప్ప ఒక్క మంచి పని చేయలేదు. కొత్త ఇండస్ట్రీలు వచ్చుడేమో కానీ.. ఉన్న ఇండస్ట్రీలు వెళ్లిపోతున్నాయి.
ఫార్మా సిటీని రద్దు చేశారు. ఇలా తెలివి తక్కువోళ్లకు అవకాశం ఇస్తే కరెంట్, ఉద్యోగాలు రావు. రియల్ ఎస్టేట్ ఢమాల్.. ఇచ్చిన గ్యారెంటీ నిలుపుకోలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అని కేటీఆర్ ధ్వజమెత్తారు.