KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అర్హులందరికీ రుణమాఫీ చేశాం.. ఇగ ఇచ్చేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
రైతులకు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ సర్కార్.. ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు. చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు ఇచ్చారని కేటీఆర్ మండిపడ్డారు.
నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై ఇందిరమ్మ రాజ్యం గునపం దింపిందని కేటీఆర్ పేర్కొన్నారు. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్కు కపట కాంగ్రెస్ తూట్లు పొడిచిందని నిప్పులు చెరిగారు. అధికారం కోసం అందరికి రుణమాఫీ.. అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ అన్నట్టు ఉంది. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు.. పెట్టెలో ఓట్లు పడ్డాయ్.. జేబులో నోట్లు పడ్డాయ్.. ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం అని కేటీఆర్ విమర్శించారు.
రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారు. నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు. నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలు. మిస్టర్ రాహుల్, మాఫీమాంగో తెలంగాణసే అని కేటీఆర్ పేర్కొన్నారు. జాగో తెలంగాణ జాగో! అని నినదించారు కేటీఆర్.
ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు
చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు.
ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు.
నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం
చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్
అధికారం కోసం… pic.twitter.com/EuYw4HHEsj
— KTR (@KTRBRS) March 23, 2025