హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా కొలువైన ప్రభుత్వం అప్పుల పేరుతో తమపై అభాండాలు వేసిందని, శ్వేతపత్రం పేరుతో అంకెల గారడీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో పేదరికం బాగా తగ్గిందని చెప్పారు. NFHS డాటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం ఉండగా, మేం దిగిపోయే నాటికి కేవలం 5.8 శాతానికి చేరిందని తెలిపారు. దేశంలోని మరే రాష్ట్రంలో ఇంత వేగంగా పేదరికం తగ్గలేదన్నారు. ఇలా అన్ని విషయాల్లో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు బృందాలను పంపాయని, వాళ్ల రాష్ట్రాల్లో కూడా వాటిని అమలు చేశాయని తెలిపారు. శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పిన అప్పుల లెక్కల గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నిన్నగాక మొన్న కొలువదీరిన తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం పేరిట అంకెల గారడీ చేసింది. అప్పుల పేరుతో అభాండాలు వేసింది. వాళ్లు శ్వేతపత్రంలో చెప్పిన ప్రకారం FRBM పరిమితి లోపల తెలంగాణ అప్పులు రూ.3,89,673 కోట్లు. అంతకుముందు వాళ్ల ప్రభుత్వం మాకిచ్చి పోయిన అప్పులు72,658 కోట్లు. స్థూలంగా మా ప్రభుత్వం తెచ్చిన అప్పులు 3,17,015 కోట్లు మాత్రమే. ఈ అప్పును వాళ్లు రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ గ్యారంటీ ఉన్న SPV అప్పులు రూ.1,27,208 కోట్లు కాగా, SPV రుణాలు రూ.1,18,557 కోట్లు. ప్రభుత్వ హామీ లేని రుణాలు మరో రూ.59,414 కోట్లు. అయితే ఈ మూడు రకాల రుణాలు ప్రభుత్వ అప్పులు కావు. కానీ, కొత్త ప్రభుత్వం మాత్రం తాము తెచ్చిన రూ.3,17,015 కోట్ల అప్పులకు పై మూడు రకాల అప్పులను కూడా జతచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం రూ.6,71,757 కోట్ల అప్పులు చేసినట్లుగా చూపించింది. కానీ, మేం దిగిపోయే నాటికి ఉన్న అప్పు మాత్రం కేవలం రూ.3,17,015 కోట్లు మాత్రమే. ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్లుగా చెప్పడం శుద్ధ అబద్ధం’ అన్నారు. ప్రభుత్వం చూపించిన లెక్కలు తప్పుల తడకలుగా ఉన్నాయని చెప్పడానికి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అప్పులను ఉదాహరణగా తీసుకున్నారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అప్పుల గురించి ఆయన ఏమన్నారంటే.. ‘సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో రూ.56 వేల కోట్ల అప్పు ఉందని శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పింది. అది పూర్తిగా తప్పు. వాస్తవానికి సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్లో దాదాపు రూ.30 వేల కోట్ల విలువచేసే ధాన్యం ఉంది. ఆ ధాన్యం అమ్మితే రూ.30 వేల కోట్లు వస్తాయి. అమ్మిన ధాన్యానికి రావాల్సిన నిధులు రూ.16 వేల కోట్లు ఉన్నాయి. ఉన్న ధాన్యం విలువను, అమ్మిన ధాన్యానికి రావాల్సిన నిధులను లెక్కలోకి తీసుకోకుండా సివిల్ సప్లయ్ కార్పొరేషన్కు రూ.56 వేల కోట్లు అప్పులు ఉన్నయని ప్రభుత్వం చెబుతున్నది. ఇది చాలా దారుణం. కొత్త ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతున్నదనడానికి ఇదో గొప్ప ఉదాహరణ’ కేటీఆర్ చెప్పారు.